Visakhapatnam District: శ్రీకాకుళం జిల్లాలో ఐఎస్ఐ ఉగ్రవాది అరెస్ట్.. కట్టుదిట్టమైన భద్రత మధ్య విశాఖకు తరలింపు

  • లారీ డ్రైవర్‌ను హతమార్చిన ఉగ్రవాది
  • విశాఖ పోలీసుల సాయంతో పట్టుకున్న ఎన్ఐఏ
  • విశాఖలో రహస్య ప్రదేశంలో విచారణ

పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని నిన్న రాత్రి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నుంచి టమాటా లోడుతో పశ్చిమబెంగాల్ కు వెళ్తున్న లారీని అడ్డగించిన ఓ వ్యక్తి.. డ్రైవర్‌ను హతమార్చాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అందులో ఉగ్రవాద కోణం ఉన్నట్టు అనుమానించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు లారీని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా విశాఖపట్టణం పోలీసులను అప్రమత్తం చేశారు.

లారీ కదలికలపై నిఘా పెట్టిన విశాఖ పోలీసులు చివరికి శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద లారీని అదుపులోకి తీసుకుని అందులో ఉన్న అనుమానిత ఉగ్రవాదితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కట్టుదిట్టమైన  భద్రత నడుమ విశాఖపట్టణం తలించి రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న అనుమానిత ఉగ్రవాదిని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అష్రఫ్‌గా గుర్తించగా, మిగతా ముగ్గురినీ శరద్ అలీ, సయీద్‌హసీం, షాజహాన్‌లుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేయడంలో సిమ్ కార్డు కీలక పాత్ర పోషించింది. ఐఎస్ఐ ఏజంట్లు గతంలో ఉపయోగించిన సిమ్ కార్డునే అష్రఫ్ వినియోగించడంతో పోలీసుల పని సులభమైంది. దాని ఆధారంగానే వీరిని అరెస్ట్ చేయగలిగారు.

More Telugu News