Divya Vani: రాజధాని మహిళలపై దాడులను ఎందుకు ఖండించడం లేదు?: వాసిరెడ్డి పద్మపై దివ్యవాణి ఫైర్

  • మీ వ్యాఖ్యలు మహిళలు తలదించుకునేలా ఉన్నాయి
  • ఏ రాష్ట్రానికీ పట్టని దుర్గతి మన రాష్ట్రానికి పట్టింది
  • సామాజిక మాధ్యమాల్లో డప్పు కొట్టించుకోవడం కాదు!

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాజధానిలో మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎందుకు ఖండించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలోని మహిళలందరూ తలవంచుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ రాష్ట్రానికీ పట్టని దుర్గతి మన రాష్ట్రానికి పట్టిందని అన్నారు.

రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడం ద్వారా కశ్మీర్ ను తలపిస్తోందని, ఈ విషయాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. మహిళలు పడుతున్న బాధలను పట్టించుకునే పదవుల్లో ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో డప్పు కొట్టించుకోవడం కాదు, రాష్ట్రంలోని మహిళల మధ్యకు వచ్చే ధైర్యం మీకు ఉందా? అని ఆమెను ప్రశ్నించారు.

రాష్ట్రంలోని ప్రతి మహిళా ఓ ఝాన్సీ లక్ష్మీబాయిగా, రుద్రమదేవిగా మారబోతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నామని అన్నారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారిని ఆసుపత్రికి వచ్చి ఆమె పరామర్శించాలని వాసిరెడ్డి పద్మను డిమాండ్ చేశారు. ఆ బిడ్డను ఆ స్థితికి తీసుకొచ్చిన పోలీస్ అధికారి ఎవరో, ఆమె ఏం తప్పు చేసిందో ప్రజల ముందు చెప్పాలంటూ వాసిరెడ్డి పద్మకు సవాల్ విసిరారు.

More Telugu News