Chandrababu: నా భార్య, కొడుకు, కోడలిపై దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా?: చంద్రబాబుపై విరుచుకుపడ్డ ముద్రగడ

  • చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ
  • తన కుటుంబాన్ని లాఠీలతో కొట్టించారని ఆగ్రహం
  • జోలె పట్టి అడుక్కోవడానికి సిగ్గులేదూ అంటూ మండిపాటు

కాపు ఉద్యమం జరిగిన సమయంలో చంద్రబాబు తన కుటుంబాన్ని దారుణంగా లాఠీలతో కొట్టించారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. చంద్రబాబు తన సామాజిక వర్గం మహిళలపై దాడి జరగ్గానే ప్రజాస్వామ్యం గురించి  మాట్లాడుతున్నారని, నాడు నా భార్య, కొడుకు, కోడలిపై దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అంటూ నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు కాదా? అంటూ మండిపడ్డారు.

కాపు ఉద్యమాన్ని చూపించొద్దని మీడియాను కూడా ఆదేశించారని, మాకు జరిగిన అవమానం గురించి వెల్లడించకుండా మీడియాను కట్టడి చేయాలని ఏ చట్టం చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాక్షస పాలన నుంచి తొలుత తెలంగాణ విముక్తురాలైందని, ఆ తర్వాత ఏపీ ప్రజలు స్వేచ్ఛ పొంది అదృష్టవంతులయ్యారని ముద్రగడ పేర్కొన్నారు. నాడు చందాలతో ఉద్యమం చేస్తున్నానని నాపై అభాండాలు వేశారు, ఇప్పుడు మీరు జోలె పట్టి అడుక్కుంటున్నారు, సిగ్గుగా లేదూ? అంటూ నిలదీశారు.

More Telugu News