Andhra Pradesh: అమరావతిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ విధింపుపై హైకోర్టు ఆగ్రహం!

  • పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను పరిశీలించిన న్యాయమూర్తి
  • విచారణ సోమవారానికి వాయిదా వేయాలన్న అడ్వొకేట్ జనరల్
  • కుదరదన్న న్యాయమూర్తి
  • ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఆదేశం

కొన్నిరోజులుగా ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నాలుగు వారాలుగా నిత్యం అక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. రాజధాని తరలింపుపై రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని కోసం తాము చేసిన భూ త్యాగం వృథా పోవాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు రాజధాని రైతులు, మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.

వారు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజా పరిస్థితులపై స్పందించింది. అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో పోలీసు చట్టాలు అమలు చేయడంపై అసంతృప్తి వెలిబుచ్చింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. వచ్చే సోమవారం వరకు విచారణ వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోరినా, అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పూర్తి వివరాలతో శుక్రవారం ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

పరిస్థితుల తీవ్రత దృష్ట్యా త్వరితగతిన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, రైతులు, మహిళలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లు అటుంచితే, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించిందని సీనియర్ న్యాయవాది ఒకరు వెల్లడించారు.

More Telugu News