Varanasi: కాశీ విశ్వేశ్వరుడి గర్భాలయ ప్రవేశానికి ‘డ్రెస్ కోడ్’

  • భక్తులు జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే
  • పురుషులు ధోతీ-కుర్తా, స్త్రీలు చీరలు ధరించాలి
  • త్వరలో అమలుకానున్న కొత్త నిబంధనలు

వారణాసిలోని విశ్వేశ్వరుడి గర్భాలయంలోకి ప్రవేశించాలనుకునే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం నూతన నిబంధనలను ప్రకటించింది.

గర్భగుడిలోని జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలనుకునే భక్తులు సంప్రదాయక దుస్తులు ధరించాలని, పురుషులు ధోతీ-కుర్తా, స్త్రీలు చీర లాంటివి ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమతించమని, దూరం నుంచే దర్శించుకోవాలని పేర్కొంది.

వారణాసి ఆలయంలో ఈ డ్రెస్ కోడ్ నిబంధనలను త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, కాశీ విశ్వనాథ ఆలయం తీసుకున్న నిర్ణయంతో మోడ్రన్ దుస్తులు ప్యాంట్, షర్టు, జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వంటి దుస్తులు ధరించి శివలింగాన్ని స్పర్శించడం ఇకపై కుదరదు.

More Telugu News