Mahesh Babu: నిన్నటి నుంచి నా ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది: మహేశ్ బాబు

  • శనివారం సరిలేరు నీకెవ్వరు రిలీజ్
  • థాంక్యూ మీట్ నిర్వహించిన చిత్రబృందం
  • కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడం అద్భుతంగా ఉందన్న మహేశ్ బాబు

మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో మహేశ్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమాకు ఇంత భారీ స్పందన వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. దర్శకుడికి మాత్రం సినిమాపై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. నిన్నటి నుంచి తన ఫీలింగ్ చాలా కొత్తగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్ల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే అద్భుతంగా అనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

వేరే కమిట్ మెంట్స్ ఉన్నా ఎఫ్2 నచ్చడంతో వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించానని మహేశ్ బాబు వివరించారు. కేవలం రెండు నెలల్లో స్క్రిప్ట్ రాసి తీసుకొచ్చాడని, ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అనిల్ రావిపూడికే దక్కుతుందని చెప్పారు. దూకుడు చిత్రం తర్వాత కంటెంట్ ప్రధానమైన సినిమాలు చేశానని, వాటి స్క్రిప్ట్ డిమాండ్ చేసిన మేరకే తన పాత్రలు ఉండేవని అన్నారు. కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తన పాత్ర ఎనర్జటిక్ గా మలిచారని వివరించారు.

More Telugu News