Maharashtra: స్నానం చేయని భర్తతో సర్దుకుపోలేను... విడాకులు ఇప్పించండి: మహిళా కమిషన్ ను కోరిన యువతి

  • భర్త నుంచి దుర్గంధం వస్తోందని యువతి ఫిర్యాదు
  • రోజుల తరబడి స్నానం చేయడని వెల్లడి
  • పిల్లలు కలుగుతారన్న ఆశ కూడా లేదని ఆవేదన

మహారాష్ట్రలోని పుణే నగరానికి చెందిన ఓ యువతి తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ  మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. ఇంతజేసీ ఆమె భర్త రాచి రంపాన పెట్టడం కానీ, ఆమెను హింసించడం కానీ చేయడంలేదు. విడాకుల కోసం ఆమె చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. తన భర్త స్నానం చేయడని, పళ్లు తోమడని, అతడి నుంచి వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నానని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. రోజుల తరబడి మురికిగా ఉండిపోతాడని తెలిపింది.

తనకు పిల్లలు కూడా కలగలేదని, ఇకముందు కలుగుతారన్న నమ్మకం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె భర్త ఓ ప్లంబర్. భార్య ఫిర్యాదుతో మహిళా కమిషన్ అతడ్ని పిలిచి విచారించింది. భార్యతో కలిసి ఉండాలనే కోరుకుంటానని తెలిపాడు. దాంతో, భార్యభర్తలను కూర్చోబెట్టి కమిషన్ సభ్యులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి రెండు నెలలు సమయం ఇచ్చి సర్దుకుపోయేందుకు అవకాశం ఇచ్చారు. అప్పటికీ విభేదాలు తొలగిపోకపోతే విడాకుల సంగతి అప్పుడు ఆలోచిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.

More Telugu News