Andhra Pradesh: ఏపీలో పరిస్థితి పట్ల ఓ తెలంగాణ వ్యక్తిగా సంతోషిస్తున్నా... కానీ!: రేవంత్ రెడ్డి

  • భారత పౌరుడిగా బాధపడుతున్నానని వెల్లడి
  • ఏపీ కుప్పకూలే పరిస్థితిలో ఉందన్న రేవంత్ రెడ్డి
  • ఏపీ సంక్షోభం వల్ల హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందని వ్యాఖ్యలు

ఏపీలో ఓవైపు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తుండగా, మరోవైపు మూడు రాజధానుల అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఏపీ పరిస్థితులపై స్పందించారు. అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రంలో నేడు సంక్షోభం నెలకొందని, కేవలం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి లాభం చేకూర్చేందుకే గందరగోళ పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకుందని తెలిపారు. ఓ తెలంగాణ వ్యక్తిగా ఈ పరిణామం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని, కానీ ఏపీ పరిస్థితి చూస్తుంటే ఓ భారత పౌరుడిగా ఎంతో బాధగా ఉందని వివరించారు. ప్రస్తుతం ఏపీ కుప్పకూలే పరిస్థితిలో ఉందని అన్నారు. ఏపీ తిరోగమనం వల్ల తెలంగాణ లాభపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.

More Telugu News