BJP: కేంద్ర నిధులను కన్నా తెప్పిస్తే రాజధానిని తరలించం: మంత్రి వెల్లంపల్లి

  • రాజధానిని తరలించొద్దంటున్న బీజేపీ లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలి
  • ఆ నిధులను కన్నా తెస్తే ఆయన పేరిట రాజధాని
  • పవన్ కు విజన్ లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న బీజేపీ కోర్ కమిటీ తీర్మానం గురించి వెల్లంపల్లి ప్రస్తావిస్తూ, అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు లక్ష కోట్ల రూపాయలను బీజేపీ కనుక ఇస్తే రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని, కేంద్ర నిధులను కన్నా లక్ష్మీనారాయణ తెప్పిస్తే ఆయన పేరిట రాజధానిని నిర్మిస్తామని సెటైర్లు విసిరారు.

రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని ఆనాడు టీడీపీ, బీజేపీలు కేంద్రానికి చెప్పలేదా? అని ప్రశ్నించిన వెల్లంపల్లి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కు విజన్ లేదని ప్యాకేజ్ ఇస్తే చాలని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని అన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని, చంద్రబాబు ఉచ్చులో పడొద్దని రైతులకు సూచించారు.

More Telugu News