Narayana Swami: ఆ పని చేస్తే బాలకృష్ణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • టీడీపీలో మిగిలేది చంద్రబాబు, లోకేశ్ లే
  • రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు
  • అమరావతి రైతులను ఆదుకుంటాం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం మొదలు పెడితే, తెలుగుదేశం పార్టీలో మిగిలేది చంద్రబాబు, లోకేశ్ మాత్రమేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, బాలకృష్ణపై ఉన్న కాల్పుల కేసును తిరిగి తెరుస్తామని చెబితే, ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారని అన్నారు. తన ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో బాలకృష్ణ, నాటి సీఎం వైఎస్ సహాయంతోనే బయటపడ్డారని నారాయణస్వామి గుర్తు చేశారు.

ఆపై ఇతర పార్టీ నేతలను బెదిరింపులతో చేర్చుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా, సమాధానాన్ని దాటవేశారు. సీఎంగా చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చేసిందేమీ లేదని మండిపడ్డ ఆయన, స్వలాభం కోసమే అమరావతి పేరిట ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

More Telugu News