APSRTC: ఏపీఎస్ఆర్టీసీ మాస్టర్ ప్లాన్... వెలవెలబోతున్న టీఎస్ఆర్టీసీ బస్సులు!

  • బస్సు చార్జీలో 40 శాతం తగ్గింపు
  • నిండిపోతున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు
  • చార్జీలను సవరించేందుకు అంగీకరించని తెలంగాణ అధికారులు

సంక్రాంతి సీజన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు వేసిన ఓ ప్లాన్, తెలంగాణ బస్సులు వెలవెలబోయేలా చేసింది. ఏపీ బస్సులేమో కిటకిటలాడుతుండగా, తెలంగాణ బస్సులు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య డిమాండ్ అధికంగా ఉండగా, ఇరు రాష్ట్రాల బస్సు టికెట్ల మధ్య భారీ తేడా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆంధ్రప్రదేశ్, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే బస్సు టికెట్ ధరలను 40 శాతం తగ్గించింది.

హైదరాబాద్ కు వెళ్లి, ప్రయాణికులను తీసుకుని వచ్చే బస్సుల డీజిల్ ఖర్చులైనా రావాలన్నది ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల ఆలోచన. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వారితో ఈ బస్సులు నిండిపోతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ అధికారులు మాత్రం చార్జీలను తగ్గించలేదు. దీంతో హాఫ్ రిటర్న్ చార్జీతో విజయవాడ వెళ్లిన బస్సులు, పూర్తి ఖాళీగా వెనక్కు వస్తున్న పరిస్థితి.

ఉదాహరణకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చార్జీ రూ. 372 కాగా, ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చార్జీ రూ. 223గా ఉంది. కాగా, మనం కూడా ఏపీ మాదిరిగా చార్జీలను తగ్గిద్దామని కొన్ని డిపోల మేనేజర్లు కోరినా, ఉన్నతాధికారులు అంగీకరించలేదని సమాచారం.

More Telugu News