Telangana: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి కారును తనిఖీ చేసిన పోలీసులు!

  • మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • తొర్రూరు సమీపంలో పోలీసుల పికెట్
  • తన కారునూ తనిఖీ చేయాలన్న ఎర్రబెల్లి

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో జరిగింది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ధన ప్రవాహాన్ని నివారించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తొర్రూరు ప్రాంతంలో ప్రత్యేక పికెట్ ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు.

ఆ సమయంలో కొడకండ్ల వైపు వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కారులో అదే మార్గంలో వచ్చారు. కారును ఆపిన తరువాత మంత్రిని గుర్తించిన పోలీసులు, తనిఖీ చేసేందుకు తటపటాయిస్తున్న వేళ, తనిఖీ చేయాలని ఎర్రబెల్లి సూచించారు. పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు తాను సహకరిస్తానని, నిబంధనల ప్రకారం కారును చెక్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. తనిఖీల అనంతరం అందులో ఏమీ లేదని తేల్చిన పోలీసులు, ఎర్రబెల్లి కారు ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.

More Telugu News