Jagan: కులాల మీద పగబట్టి, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదు: జగన్ పై నాగబాబు ఫైర్

  • హిట్లర్ కన్నా గొప్పవాళ్లు ఎవరూ లేరు
  • అలాంటి హిట్లర్ కూడా నాశనమయ్యాడు
  • మీరు ఆ తప్పు చేయవద్దు

అమరావతి ప్రాంత మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. అమ్మవారి గుడికి వెళ్తున్న మహిళలపై లాఠీఛార్జి చేశారని న్యూస్ లో చెబుతున్నారని... ఇదే నిజమైతే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని అన్నారు. యూదుల మీద పగబట్టి వాళ్ల జాతిని నాశనం చేసిన అడాల్ఫ్ హిట్లర్ కన్నా గొప్పవాళ్లు ఎవరూ లేరని... అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడని చెప్పారు.

జగన్ రెడ్డి గారూ, మీరు ఆ తప్పు చేయవద్దంటూ హితవు పలికారు. మీ తొందరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకునే సమయం ఇంకా మీకుందని చెప్పారు. కులం అనేది ఎప్పుడూ చెడ్డది కాదని... మనుషుల్లోనే మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని... కులాల మీద పగబట్టి, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతానికి చెందిన నెత్తురోడుతున్న ఓ మహిళ ఫొటోను షేర్ చేశారు.

More Telugu News