Ala Vaikunthapuramulo: 'అల వైకుంఠపురములో..' ఈవెంట్ మేనేజర్లపై పోలీసుల కేసు!

  • రెండు రోజుల క్రితం యూసుఫ్ గూడలో ఈవెంట్
  • పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన నిర్వాహకులు
  • కేసును విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన 'అల వైకుంఠపురములో..' చిత్రంపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఆ రోజు సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ ను శ్రేయాస్ మీడియా, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్వహించాయి. అయితే, అనుమతి తీసుకున్న సమయాని కన్నా అదనంగా మరికొంత సేపు కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ విషయంలో పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది.

ఈ మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, నిర్మాణ సంస్థ మేనేజర్ యగ్నేశ్ లపై కేసును నమోదు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 5 నుంచి 6 వేల మంది వరకూ అభిమానులు వస్తారని, రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమం ముగుస్తుందని చెప్పారని ఆయన అన్నారు. అయితే, దాదాపు 15 వేల మందిని నిర్మాణ సంస్థ ఆహ్వానించిందని, ఆరు వేల మంది దాటరని చెప్పి, మరింత మందిని తరలించడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అభియోగాలు నమోదు చేశారు.

పైగా రాత్రి 11.30 గంటల వరకూ కార్యక్రమం జరిగిందని, స్వల్ప తొక్కిసలాట కూడా జరిగిందని, కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పోలీసులు అభిమానులను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించామని అన్నారు.

More Telugu News