Asaduddin Owaisi: 'సాఫ్ట్‌వేర్ సంస్థల్లో జిహాదీ'ల విషయంపై సైబరాబాద్ సీపీకి అసదుద్దీన్ ఒవైసీ సలహా!

  • హైదరాబాద్‌లోని అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో జిహాదీలు పనిచేస్తున్నారా?
  • పోలీసులను ప్రశ్నించిన నెటిజన్
  • అప్రమత్తమయ్యామని సమాధానం ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు
  • ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారు? అని ఒవైసీ ప్రశ్న 

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇరాక్‌, ఇరాన్‌, అమెరికాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ కొనసాగింది.

'హైదరాబాద్‌లోని అమెరికా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో జిహాదీల సానుభూతి పరులు పనిచేస్తున్నారా? అమెరికా ఆస్తులను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి అప్రమత్తమయ్యారా? సోదాలు జరుపుతున్నారా? లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారా?' అంటూ ఒకరు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సిల్‌కు ప్రశ్నలు సంధించారు. దీనిపై సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి సమాధానం వచ్చింది.

'అవును సర్... ఇటువంటి వాటిపై నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించి, జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు ప్రత్యేక శాఖలు ఉన్నాయి. మా బృందాలు 24X7 గంటలు పనిచేస్తాయి. మమ్మల్ని అప్రమత్తం చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాకు సమాచారం అందిస్తూనే ఉండండి' అని అందులో సైబరాబాద్ సీపీ ట్విట్టర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు..

దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 'అవును సర్ అంటూ హైదరాబాద్‌ సీపీ సర్ రిప్లై ఇస్తున్నారు. అటువంటి సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతమంది జిహాదీలు పనిచేస్తున్నారు? దయచేసి చెబుతారా? లేదంటే అసలు మీ ఉద్దేశం ఏంటనే దానిపై కాస్త స్పష్టతనిస్తారా? మీరు భక్తులకే సమాధానం చెబుతారా? లేదంటే నాలాంటి ఎంపీకి కూడా చెబుతారా?' అని ప్రశ్నించారు.  

'సీపీ సర్, మీరు ఏమైనా చేసుకోండి.. కానీ, ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్ల పేరుతో మాత్రం చంపకండి. వీలైతే అరెస్టు చేయండి.. థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించొచ్చు. సీపీ సర్, ఉగ్రవాదానికి మతం లేదు' అని మరో ట్వీట్‌లో అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

More Telugu News