Fishermen: సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞత తెలిపిన మత్స్యకారులు

  • పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించడంతో అరెస్టు 
  • దాదాపు 13 నెలలపాటు నిర్బంధించిన పాక్ 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో విడుదల

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 20 మంది మత్స్యకారులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. పాకిస్థాన్ చెర నుంచి స్వేచ్ఛా జీవితం ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 2018 నవంబరు 27న అరేబియా సముద్రం గుజరాత్ తీరంలో మొత్తం 22 మంది చేపల వేట చేస్తూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో ఆ దేశ భద్రతా సిబ్బంది వీరిని అరెస్టుచేసి 13 నెలలపాటు జైల్లో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వీరి విడుదలకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది.

దీంతో రెండు రోజుల క్రితం మొత్తం 22 మందిలో 20 మందిని పాకిస్తాన్ విడుదల చేయగా వాఘా సరిహద్దు వద్ద వీరికి రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. వీరంతా ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

అనంతరం తాడేపల్లి వచ్చి మంత్రి వెంట జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి తమను విడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు.

More Telugu News