Shubhman Gill: యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ కొరడా.. మ్యాచ్ ఫీజులో వందశాతం కోత

  • రంజీ మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వివాదం
  • అవుటైనా క్రీజు వదలని వైనం
  • ఢిల్లీ ఆటగాడు ధ్రువ్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత

ఢిల్లీ-పంజాబ్ మధ్య గత వారం జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. అతడి మ్యాచ్ ఫీజులో వందకు వంద శాతం కోత విధించింది. శుక్రవారం ఢిల్లీతో మొదలైన రంజీ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ తరఫున బ్యాటింగ్‌‌కు దిగిన గిల్‌‌ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుబోధ్‌‌ భాటి బౌలింగ్‌‌లో ఔటయ్యాడు. అంపైర్ అవుటిచ్చినప్పటికీ క్రీజు వదలని గిల్.. ఆ తర్వాత అంపైర్ మహ్మద్ రఫీ వద్దకు వెళ్లి తాను అవుట్ కాదంటూ వాదించాడు. అక్కడితో ఆగక అతడిని దూషించాడు.

దీంతో లెగ్ అంపైర్‌ను సంప్రదించిన రఫీ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గిల్ ప్రవర్తన కారణంగా మ్యాచ్ పది నిమిషాలపాటు నిలిచిపోయింది. మ్యాచ్ ప్రారంభమయ్యాక గిల్ 23 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. అయితే, గిల్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. ఇదే వివాదంలో పాలుపంచుకున్న ఢిల్లీ ఆటగాడు ధ్రువ్ షోరే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.

More Telugu News