inter: ఇంటర్ బోర్డులో తప్పులు చేసే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు వుంటాయి: తెలంగాణ సీఎస్ హెచ్చరిక

  • బీఐజీఆర్ఎస్ యాప్‌ ప్రారంభం
  • పరీక్షలు పకడ్బందీగా జరగాలని సీఎం కేసీఆర్ చెప్పారు
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దాం
  • ఈ సారి తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు

గత ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు విద్యార్థులు బలైపోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఏడాది అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల్లో ఇంటర్ విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రెడ్సెల్ సిస్టం (బీఐజీఆర్ఎస్) యాప్‌ను ప్రారంభించారు.

చిన్న తప్పు కూడా జరగకుండా చర్యలు 

రాష్ట్రంలో అన్ని పరీక్షలు పకడ్బందీగా జరగాలని సీఎం కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దామన్నారు. ఈ సారి తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. చిన్న తప్పు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

ఒక్కరోజులోనే సమస్యల పరిష్కారం

బీఐజీఆర్ఎస్ యాప్‌ ద్వారా విద్యార్థులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కూడా ఒకటని అన్నారు. విద్యార్థులు ఇకపై ఒక్కరోజులోనే తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. త్వరలోనే ఈ యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బోర్డులో తప్పులు చేసే అధికారులు, సిబ్బందికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News