Ala Vaikunthapuramulo: ఉర్రూతలూగిస్తున్న అల.. వైకుంఠపురములో ప్రీరిలీజ్ ఈవెంట్

  • హైదరాబాదులో మ్యూజికల్ ఈవెంట్
  • డ్రమ్స్ తో అదరగొట్టిన శివమణి
  • హృద్యంగా ఆలపించిన ప్రియా సిస్టర్స్

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సునీల్, టబు తదితరులు హాజరయ్యారు.

 ఈ కార్యక్రమంలో భాగంగా డ్రమ్ ఆర్టిస్ట్ శివమణి ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది. అనేక రకాల డ్రమ్స్ ను ఆయన అలవోకగా వాయిస్తూ భిన్నరకాల ధ్వనులను సృష్టించారు. ఆఖరికి ఓ బకెట్ లో నీళ్లను ఉంచి దాన్నుంచి కూడా సంగీతాన్ని ఉత్పత్తి చేసి శివమణి ద గ్రేట్ అనిపించుకున్నారు.

అంతకుముందు, ప్రముఖ శాస్త్రీయ సంగీతవిద్యాంసుల జోడీ ప్రియాసిస్టర్స్ అల... వైకుంఠపురములో అంటూ అత్యంత మధురంగా ఆలపించి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సునీల్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ తో తన అనుబంధాన్ని మరోసారి పంచుకున్నారు. సునీల్ అనే బట్టల జతను త్రివిక్రమ్ కొనుక్కుని ప్రతిసారి బయటికి వెళ్లేటప్పుడు ఆ బట్టల జతనే వేసుకుని వెళుతుంటాడు, అంటే త్రివిక్రమ్ తీసే ప్రతి చిత్రంలో నన్ను కూడా అందులో పడేస్తుంటాడు. రియల్లీ థాంక్యూ త్రివిక్రమ్ అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

More Telugu News