Andhra Pradesh: బుగ్గన నిరాధార ఆరోపణలు చేశారు.. పరువు నష్టం దావా వేస్తున్నా: బీజేపీ నేత రావెల

  • రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నా
  • ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు
  • బుగ్గన బహిరంగ క్షమాపణ చెప్పాలి

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు పరువు నష్టం కేసు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు రావెల మీడియాతో మాట్లాడుతూ.. బుగ్గనపై రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసుతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతినేలా బుగ్గన వ్యాఖ్యలు చేశారంటూ.. రాజధాని అనేది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేదన్నారు. రాజధాని తరలింపు విషయంలో తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతోందని చెప్పారు.

తన నోటీస్ అందిన తర్వాత బుగ్గన బహిరంగ క్షమాపణ చెప్పాలని రావెల డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజధానిలో తనకు భూములున్నాయని అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను అద్దె ఇంట్లో ఉంటున్నానంటూ.. కుటుంబ పోషణే కష్టతరంగా ఉంటే రాజధానిలో భూములు ఎలా కొంటానని ప్రశ్నించారు. దళిత నేతగా స్వయంకృషితో ఎదిగిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు.

More Telugu News