Tirumala: తిరుమలలో ఈ 20 నుంచి రాయితీ లడ్డూలు కట్!

  • మరొకటి కావాలంటే రూ. 50 పెట్టాల్సిందే
  • రాయితీలు తొలగించిన టీటీడీ
  • భక్తుల్లో నెలకొన్న అయోమయం

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయం ఇటీవల తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై ఎన్ని లడ్డూలు కావాలన్నా ఒక్కొక్కటి రూ. 50 పెట్టి కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఈ విషయంలో నిన్న సమావేశమైన టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 20 నుంచి కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం తిరుమలకు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల ద్వారా నడిచివచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూ ఇస్తున్న టీటీడీ, ఇకపై ప్రతి భక్తుడికీ ఒక లడ్డూను ఇవ్వాలని నిర్ణయించింది.

అంతవరకూ బాగానే ఉంది. ఆపై లడ్డూలు కావాలంటే మాత్రం రాయితీ లేకుండా కొనుగోలు చేయాలన్న నిర్ణయమే వివాదాస్పదం అవుతోంది. ప్రస్తుతం రూ. 300 ప్రత్యేక దర్శనాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సమయంలోనే ఒక్కొక్కరికీ రూ. 25 చొప్పున, రెండు లడ్డూలను ఇస్తున్నారు. ఓ కుటుంబంలో నలుగురు స్వామిని దర్శించుకుంటే, వారికి 8 లడ్డూలతో పాటు, మరో 8 లడ్డూలు తీసుకునే సదుపాయం ఉంది. ఇకపై ఆ సౌలభ్యం లభించబోదు.

ఇదే సమయంలో ఒక్కో భక్తుడికి ఎన్ని లడ్డూలు ఇవ్వాలన్న విషయమై నిర్ణయం వెలువడలేదు. కుటుంబంలోని నలుగురు, లేదా ఐదుగురు స్వామి దర్శనానికి వెళితే, వారందరికీ ఉచితంగా ఒక్కో లడ్డూ లభిస్తుంది. ఆపై అధికంగా కావాలంటే, అందరూ క్యూ లైన్లలోకి వెళ్లాలా? లేక, ఒకరు వెళ్లి, డబ్బులు కట్టి, లడ్డూలు తెచ్చుకోవచ్చా? అన్న విషయమై స్పష్టత లేకపోవడం భక్తులను అయోమయానికి గురి చేస్తోంది.

More Telugu News