SarileruNeekevvaru: ఇదొక మిరాకిల్ డే... అన్ని మంచి ఘటనలు ఒకే రోజు జరిగాయి: మహేశ్ బాబు

  • హైదరాబాదులో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఎల్బీ స్టేడియంలో వేడుక
  • చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి

హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేశ్ బాబు ఎమోషనల్ గా మాట్లాడారు. ఇదొక మిరాకిల్ డే అని, తమ దర్శకుడు అనిల్ రావిపూడికి ఇవాళ అబ్బాయి పుట్టాడని, నిర్మాత దిల్ రాజు రెండోసారి తాత అయ్యాడని చెప్పారు. తమ ఈవెంట్ రోజు ఇన్ని మంచి ఘటనలు జరగడం నిజంగా మిరాకిల్ అనిపిస్తోందని తెలిపారు. విజయశాంతి గారు తనను ఆకాశానికెత్తేశారని, ఆమెతో షూటింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో విజయశాంతి గారితో నటించానని, మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో నటించానని తెలిపారు. ఇప్పటికీ ఆమె క్రమశిక్షణలో ఏమాత్రం తేడాలేదని అన్నారు. చిరంజీవి గారిలో కూడా తాను అదే అంకితభావం చూశానని తెలిపారు. తమ సినిమా ఒప్పుకోవడం ద్వారా ఆమె తమకు అవకాశం ఇచ్చారని మహేశ్ బాబు వినమ్రంగా తెలిపారు.

చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెబుతూ, అంత ఎనర్జీ ఉన్న దర్శకుడ్ని మరెవ్వర్నీ చూడలేదని వెల్లడించారు. రష్మిక గురించి మాట్లాడుతూ, ఎంతో స్వీట్ అంటూ పొగిడారు. అభిమానుల గురించి చెబుతూ, ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇలాంటి అభిమానులు దక్కారని ఆనందం వ్యక్తం చేశారు. చివరగా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పి తన ప్రసంగం ముగించారు.

More Telugu News