Sachin Tendulkar: కొత్త తరాన్ని ఆకర్షించడానికి ప్రతిదీ మార్చాల్సిన అవసరం లేదు: సచిన్

  • నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లకు ఐసీసీ ప్రతిపాదన
  • సంప్రదాయ క్రికెట్ కు ఆదరణ పెంచేందుకు చర్యలు
  • వ్యతిరేకిస్తున్న సచిన్

టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత ఐదు రోజుల టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గుతోందని సంప్రదాయవాదులు ఆందోళన వెలిబుచ్చుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్ లను జనరంజకం చేసేందుకు ఐసీసీ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లను ప్రతిపాదిస్తోంది. దీనిపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందించాడు. టెస్టు మ్యాచ్ నిడివిని ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించడానికి బదులు ఐసీసీ నాణ్యమైన పిచ్ ల ఏర్పాటుపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చాడు. పిచ్ బాగుంటే టెస్టు మ్యాచ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వివరించాడు.

కొత్త తరం అభిమానులను ఆకర్షించేందుకు ఆటకు సంబంధించి ప్రతి అంశాన్ని మార్చాల్సిన అవసరం లేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో చివరిదైన ఐదో రోజున స్పిన్నర్లకు పిచ్ ఎంతో సహకరిస్తుందని, అలాంటి వెసులుబాటును స్పిన్నర్లకు దూరం చేయడం సబబు కాదని అన్నాడు. క్రికెట్ లో టెస్టు మ్యాచ్ ఫార్మాట్ స్వచ్ఛమైనదని, దీన్ని మార్చేందుకు ప్రయత్నించరాదని సూచించాడు.

More Telugu News