Hyderabad: ప్రేమించిన వాడు కట్నం అడిగాడని... చనిపోయేందుకు ప్రయత్నించిన యువతి!

  • హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఘటన
  • పెళ్లి చేసుకునేందుకు రూ. 10 లక్షలు అడిగిన యువకుడు
  • ఇచ్చుకోలేమని చెప్పినా వినలేదని మనస్తాపం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

తాను ఎంతో ప్రేమించి, పెళ్లి పీటల వరకూ తీసుకెళతానని హామీలు ఇచ్చిన వాడు, పెళ్లికి ముందు కట్నం ఇవ్వాల్సిందేనని భీష్మించుకు కూర్చోవడంతో, మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్, ఫిల్మ్ నగర్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, హిమబిందు అనే యువతి ఓ షాప్ లో సేల్స్ గర్ల్ గా పని చేస్తూ, తన ప్రాంతానికే చెందిన లక్ష్మణ్ అనే యువకుడితో ప్రేమలో పడింది.

హిమబిందును పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన లక్ష్మణ్, రూ. 10 లక్షల కట్నం ఇవ్వాలని కోరాడు. తన కుటుంబానికి అంత డబ్బు ఇచ్చే శక్తి లేదని ఆమె మొరపెట్టుకున్నా, వినలేదు. దీంతో మనోవేదనకు గురైన హిమబిందు, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకుని, చీరతో ఫ్యాన్ కు ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆమె తల్లి, తీవ్ర ఆందోళనతో కేకలు వేస్తూ, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి కుమార్తెను కిందకు దింపింది.

అప్పటికే హిమబిందు అపస్మారక స్థితికి వెళ్లగా, అపోలో జనరల్‌ ఆసుపత్రికి తరలించగా, ప్రాణాలు దక్కాయి. హిమబిందు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్ 417, 420లతో పాటు వరకట్న వేధింపులు సెక్షన్‌ 4 కింద లక్ష్మణ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

More Telugu News