CPI Narayana: ఇంత వరకు ఎవరూ నాపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. చేస్తే చెబుతా: సీపీఐ నారాయణ

  • రాజకీయాలు రాజకీయాల్లా లేవు
  • ఏం మాట్లాడినా లేనిపోనివి ఆపాదిస్తున్నారు
  • అమరావతిపై మాట్లాడితే..నన్ను చంద్రబాబు సామాజిక వర్గమే అంటారేమో!

రాజకీయాలు రాజకీయాల్లా ఉంటే తాము పోరాడగలుగుతాం కానీ, పరిస్థితి అలా లేదని సీపీఐ నారాయణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏదైనా మాట్లాడినా, విమర్శించినా లేనిపోనివి ఆపాదిస్తున్నారని విమర్శించారు. దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందని, మోదీని ఎవరైనా విమర్శిస్తే వాళ్లను ‘పాకిస్థాన్ ఏజెంట్’తో పోలుస్తున్నారని, కేసీఆర్ ను విమర్శిస్తే  ‘తెలంగాణ ద్రోహులు’ అని, జగన్ ని విమర్శిస్తే.. ‘చంద్రబాబు తొత్తులు’ అని అంటారని విమర్శించారు.

మాతృభాషలో విద్యాబోధన జరగాలన్నది తమ పాలసీ అని, ఈ విషయమై ప్రశ్నిస్తే.. ‘నీ కూతురు, కొడుకు అమెరికాలో చదవట్లేదా?’ అని అనడం ‘బ్లాక్ మెయిల్’ కిందకు వస్తుందని, వ్యవస్థ కోసం తాము ప్రశ్నిస్తుంటే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం తగదని అన్నారు. రాజధాని అమరావతి గురించి ఏదైనా మాట్లాడితే.. ‘నారాయణ కూడా చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి ఆయన అంటున్నాడంటారు’ అని విమర్శించారు.

అయితే, ఇంత వరకూ ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు తనపై చేయలేదని, చేస్తారేమోనని భయంగా వుందంటూ సెటైర్లు వేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయనివ్వండి, చేసిన తర్వాత సమాధానం చెబుతానని అన్నారు.

More Telugu News