Chandrababu: సంక్రాంతి సంబరాలు అమరావతిలోనే జరగాలి... ఆ రెండు నివేదికలు భోగిమంటల్లో తగలబడాలి: చంద్రబాబు

  • రగులుతున్న రాజధాని రగడ
  • చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
  • మూడు ముక్కలాట ఆడుతున్నారంటూ ఆగ్రహం

ఏపీలో రాజధాని అంశం రగులుతూనే ఉంది. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఘాటుగా స్పందించారు. సంక్రాంతి సంబరాలు అమరావతి కేంద్రంగానే జరగాలని, జీఎన్ రావు, బీసీజీ నివేదికలు భోగి మంటల్లో తగలబడాలని వ్యాఖ్యానించారు.

 ప్రభుత్వం, రైతుల మధ్య ఒప్పందాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా? అంటూ వైసీపీ సర్కారును ప్రశ్నించారు. రాజధానికి లక్ష పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఎవరన్నారంటూ నిలదీశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అసత్యాలు చెబుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అలాగైతే జగన్ కట్టుకున్న ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకు రాదా? అని అడిగారు.

ప్రభుత్వం 3 ముక్కలు చేస్తే, బీసీజీ కూడా మూడు ముక్కలాట ఆడుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి ఉన్మాదంతో ప్రజలు జీవితాంతం బాధపడాల్సి రావడం దారుణమని అభిప్రాయపడ్డారు. తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అసలు, విశాఖకు ఇన్ చార్జిగా ఉండేందుకు విజయసాయిరెడ్డి ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని కోసం పోరాటంలో టీడీపీ అమరావతి జేఏసీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని అన్నారు. రాజధాని సమస్య రైతులకే కాదు, ఐదు కోట్ల మంది ఆంధ్రులదని తెలిపారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.

More Telugu News