Pakistan: భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాత వీడియోలు పోస్టు చేసి నవ్వులపాలైన ఇమ్రాన్‌ఖాన్!

  • బంగ్లాదేశ్‌లో ఆందోళనకారులపై దాడి వీడియోలు పోస్ట్
  • యూపీలో ముస్లింలపై దాడి అని నమ్మించే ప్రయత్నం
  • నెటిజన్ల విమర్శలతో వీడియోలు డిలీట్

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా భారత్‌లో జరుగుతున్న ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోమారు నవ్వులపాలయ్యారు. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ముస్లింలను యూపీలో దారుణంగా హింసిస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఇమ్రాన్.. దానికి మూడు వీడియోలను జతచేశారు. అయితే, ట్వీట్ చేసిన కాసేపటికే ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పును గ్రహించిన ఇమ్రాన్ ఆ తర్వాత ఆ వీడియోలను తొలగించారు. అయితే, అప్పటికే ఇమ్రాన్‌పై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

నిజానికి ఇమ్రాన్ పోస్టు చేసిన వీడియోలు భారత్‌లో సీఏఏపై జరుగుతున్న ఆందోళనలకు సంబంధించినవి కాదు. మే 2013లో ఢాకాలో ఆందోళనకారులపై బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేసిన లాఠీచార్జ్ దృశ్యాలవి. ముందువెనక ఆలోచించకుండా వాటిని పోస్టు చేసి అభాసుపాలయ్యారు. ఓ దేశానికి ప్రధాని అయి ఉండీ ఇలాంటి ఫేక్ వీడియోలను ఎలా పోస్టు చేస్తారంటూ నెటిజన్లు నిప్పులు చెరిగారు. భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఆయన ఇరుకున పడ్డారని నెటిజన్లు కామెంట్ చేశారు.

More Telugu News