BJP: మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • దేశ విభజన జరిపిందే కాంగ్రెస్సే
  • ఆ మూడు దేశాల శరణార్థుల కష్టాలు పట్టవా?
  • మోదీ ప్రజాదరణను ఓర్వలేకపోతున్నారన్న వివేక్
  • కేసీఆర్ ముల్లా అయ్యారన్న అరవింద్

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ)లపై నిజామాబాద్ లో బీజేపీ ప్రజా ప్రదర్శన నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నార్సీలపై నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు.

మనందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, మనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పడంలేదని విమర్శించారు. సీఏఏపై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ... దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. అక్కడి నుంచి వచ్చిన మైనారిటీల గురించి ప్రస్తుతం మోదీ ప్రభుత్వం సీఏఏకు తెస్తే  కాంగ్రెస్ విమర్శిస్తోందని ధ్వజమెత్తారు. సీఏఏ కాంగ్రెస్ హయాంలో చేసిందంటూ.. దాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించిందన్నారు. మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పా? అంటూ ప్రశ్నించారు.

మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో భయాందోళనలు కల్గిస్తున్నాయని వివేక్ పేర్కొన్నారు. మనదేశానికి శరణార్థులుగా వచ్చిన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీలకు దీని వల్ల మేలు కలుగుతుందన్నారు. మోదీ ప్రజాధరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. దేశంలో గత ఆరేళ్ల నుంచి మంచి పనులు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు మన దేశం హిందూ రాష్ట్రమని అన్నారు. అనంతరమే సెక్యులర్ అయిందన్నారు. కేసీఆర్ ముల్లా అయ్యారని.. కేటీఆర్ నాస్తికుడని విమర్శించారు. సీఏఏను 80 శాతంపైగా దేశ ప్రజలు సమర్థిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్ లో 23 శాతం ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం 3 శాతానికి పడిపోయిందన్నారు. బంగ్లాదేశ్ లో 22 శాతం ఉన్న హిందువుల జనాభా 8 శాతానికి పడిపోయిందన్నారు. ఆ దేశాల్లో ఉన్న హిందువులు నరకం చూస్తున్నారని చెప్పారు.

More Telugu News