Vijayashanthi: విజయశాంతి పెడుతున్న రెండు షరతులు!

  • హీరోయిన్ గా వెలిగిన విజయశాంతి 
  • 'సరిలేరు నీకెవ్వరు'తో రీ ఎంట్రీ 
  • ప్రత్యేక పాత్రలవైపే మొగ్గు

తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా విజయశాంతి ఒక వెలుగు వెలిగారు. చాలా కాలం తరువాత ఆమె 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేశారు. ఈ సినిమాలో ఆమె కీలకమైన పాత్రను పోషించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి విజయశాంతికి వరుసగా అవకాశాలు వస్తున్నాయట. విజయశాంతి వుంటే తమ ప్రాజెక్టు క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించేవారి సంఖ్య పెరుగుతోందట.

ఈ నేపథ్యంలో విజయశాంతి రెండు షరతులు పెడుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. తల్లి పాత్రలు .. అతిథి పాత్రలు చేయననేది ఒక షరతు అయితే, భారీ పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడితేనే కథ వినిపించడానికి రావాలనేది రెండో షరతు. అంటే తన క్రేజ్ కి తగినట్టుగా పవర్ఫుల్ గా వుండే ప్రత్యేక పాత్రల్లో మాత్రమే తను నటిస్తాననీ, అందుకు తను అందుకునే పారితోషికం కూడా భారీగానే ఉంటుందని విజయశాంతి స్పష్టం చేసిందన్న మాట.

More Telugu News