Tamilnadu: ఎమ్మెల్యే పెంచుకుంటోన్న మూడు కుక్కలకు విషంపెట్టి చంపిన దుండగులు

  • తమిళనాడులోని సేలం జిల్లాలో ఘటన
  • వీరపాండి ఎమ్మెల్యే మనోన్మణి ఇంట్లో కలకలం
  • ఆలయానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు
  • శునకాలు మృతి చెంది ఉండడం చూసి షాక్ 

తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ మహిళా ఎమ్మెల్యే నివాసంలో మూడు శునకాలకు విషంపెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చంపేశారు. వీరపాండి ఎమ్మెల్యే మనోన్మణి పనమరత్తుపట్టి యూనియన్‌ పారపట్టిలో ఉంటున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఓ ఆలయానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చారు. వచ్చేసరికి తాము పెంచుకుంటోన్న మూడు పెంపుడు శునకాలు మృతిచెంది ఉండడం చూసి షాకయ్యారు.

పోలీసులకు విషయం చెప్పడంతో, వారు వాటికి పోస్ట్ మార్టం చేయించారు. వాటికి విషమిచ్చి చంపినట్లు రిపోర్టులో తేలింది. ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే పెద్ద కుమారుడు పనమరత్తుపట్టి యూనియన్‌ కౌన్సిలర్‌ పదవికి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు ఆయనను బెదిరించడానికే ఈ ఘటనకు పాల్పడ్డారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News