Kurnool District: ఆదోనిలో తొలిసారిగా పట్టుబడిన వ్యభిచార ముఠా... చూసేందుకు పట్టణవాసుల ఆసక్తి!

  • మెయిన్ స్కూల్ పక్కనే గుట్టుగా దందా
  • ఎనిమిది మంది అరెస్ట్  
  • విచారిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లా ఆదోనిలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేసి, ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా, వారిని చూసేందుకు పట్టణవాసులు పెద్దఎత్తున ఆసక్తి చూపారు. పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు పట్టుబడిన వారిని రహస్యంగా విచారిస్తున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మెయిన్ స్కూల్ పక్కన గుట్టుగా వ్యభిచారం సాగుతుండగా, ఆ సమాచారం పోలీసులకు అందింది. దీంతో దాడులు చేసిన పోలీసులు, పట్టణానికి చెందిన ముగ్గురు యువతులు, ఇద్దరు వ్యక్తులు, మరో ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు.

ఇక ఆదోనిలో వ్యభిచారం ఇంత బాహాటంగా జరుగుతూ పట్టుబడటం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ ఇటువంటి కేసులు నమోదు కాకపోవడంతో, పోలీసులు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతోంది? ఇంకా ఎన్ని స్థావరాలు ఉన్నాయి? దీని వెనుక సూత్రధారులు ఎవరు? ఇన్నాళ్లూ బయటకు ఎందుకు రాలేదు? అన్న కోణాల్లో కేసును విచారిస్తున్నారు.

పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బయటి నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి వ్యభిచార దందాను జరిపిస్తున్నారని, విచారించిన తరువాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. వీరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో, పట్టుబడిన యువతులను, విటులను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం గమనార్హం. 

More Telugu News