Congress: రాహుల్ తో కేటీఆర్ ను పోలుస్తారా?: మంత్రి ఎర్రబెల్లిపై జగ్గారెడ్డి ఫైర్

  • కేటీఆర్ కు భజన చేసుకో, పొగుడుకో
  • అంతేతప్ప ‘చెంచాగిరి’ మాత్రం చెయ్యకు  
  • రాహుల్ పై చిల్లర విమర్శలు చేయడం మానుకోండి

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పోల్చిన టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని సంగారెడ్డి విమర్శించారు.

ప్రధాని పదవిని త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ అని, అలాంటి వ్యక్తితో కేటీఆర్ ను పోల్చడం సరికాదని అన్నారు. కేటీఆర్ కు భజన చేసుకో, పొగుడుకో కానీ, ‘చెంచాగిరి’ మాత్రం చెయ్యకు అంటూ ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పై చిల్లర విమర్శలు చేయడం మానుకోని పక్షంలో అదే తీరులో తాము ప్రతి విమర్శలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి ఆయన అమ్ముడుపోయారని, ఊడిగం చేయడం మానుకోవాలని సూచించారు.

ఇక తమ నియోజకవర్గంలో మంచి నీటి ఇబ్బందులకు మంత్రి హరీశ్ రావు కారణమని, దీని గురించి ప్రస్తావించని ఆయన ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలు అడుగుతున్నారని, ఈ పాఠశాలల్లో పిల్లల చదువులు సరిగా లేవంటూ ప్రైవేట్ స్కూల్స్ కు వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

More Telugu News