Chiranjeevi: మా సమావేశం రసాభాస: పరుచూరి చేతిలోంచి మైకు లాక్కున్న రాజశేఖర్... తీవ్రంగా మండిపడిన చిరంజీవి!

  • ఓ హోటల్ లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం
  • చిరంజీవి అభిప్రాయాలను వ్యతిరేకించిన రాజశేఖర్
  • అసోసియేషన్ లో విభేదాలు ఉన్నాయని వెల్లడి
  • నిప్పును దాస్తున్నారని విమర్శలు

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, సఖ్యత లేకపోవడం అన్నది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడు 'మా' సమావేశం జరిగినా ఏదో ఒక వాడీవేడీ వివాదం ఉండడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా, 'మా' డైరీ ఆవిష్కరణ సమావేశంలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. ఇందులో చిరంజీవి కూడా ఉండడంతో సమస్య తీవ్రత మరింతగా బహిర్గతమైంది.

అసలేం జరిగిందంటే.... చిరంజీవి మైక్ అందుకుని 'మా'లో ఏవైనా సమస్యలు ఉంటే మనలో మనమే చర్చించుకుందాం, మంచి ఉంటే అందరికీ వినిపించేలా చెబుదాం అనే కోణంలో మాట్లాడారు. దీనికి హీరో రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి తర్వాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ మైక్ తీసుకుని మాట్లాడుతుండగానే, ఆయన నుంచి రాజశేఖర్ మైక్ లాక్కున్నంత పనిచేశారు. ఆపై తాను మాట్లాడుతూ, "కలిసి ఉందాం, కలిసి సాగుదాం అంటూ చిరంజీవిగారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏవేవో చెబుతుంటారు కానీ, మాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిప్పులేనిదే పొగరాదు, మనందరం హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోలుగా రియల్ లైఫ్ లో చేస్తుంటే అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు" అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చింది. రాజశేఖర్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేయగా, "వినండి మోహన్ బాబు గారూ, మీరు అరిచేస్తే ఇది జరిగిపోదు" అంటూ మరింత మొండిగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా రాజశేఖర్ దూకుడుగానే మాట్లాడారు. దాంతో చిరంజీవి మైక్ తీసుకుని, "నేను చెప్పిందేమిటి, మీరు మాట్లాడుతున్నదేమిటి, నా మాటలకు ఏమైనా విలువ ఇచ్చారా? ఇష్టంలేని వాళ్లు ఇక్కడికి రావడం ఎందుకు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో మళ్లీ రాజశేఖర్ జోక్యం చేసుకుని "ఇష్టం ఉంది కాబట్టే వచ్చాం, కాని వచ్చిన తర్వాత ఇలా జరిగింది" అంటూ అక్కడ్నించి నిష్క్రమించే ప్రయత్నం చేశారు. అంతకుముందు, చిరంజీవి మధ్యలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా రాజశేఖర్ ఘాటుగా స్పందించారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కల్పించుకోలేదు, మీరెందుకు మధ్యలో వస్తున్నారంటూ అభ్యంతరం చెప్పారు. అంతేకాదు, ఓ దశలో వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబు వంటి పెద్దల కాళ్లకు నమస్కారం చేశారు.

More Telugu News