Telangana: నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యం

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
  • తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన పెదనాన్న
  • పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

కోనంపేటకు చెందిన బాధిత చిన్నారి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తోంది. భూపాలపల్లి మండలం నాగారానికి చెందిన చిన్నారి పెదనాన్న రాస కొమురయ్య (37) ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లాడు. సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మెలకువ వచ్చి చూసిన బాధిత చిన్నారి తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో కంగారు పడింది. అందరూ కలిసి సమీపంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం ఏడు గంటల సమయంలో పత్తి చేను నుంచి ఏడుస్తూ వస్తున్న చిన్నారిని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి చెప్పింది విని విస్తుపోయారు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

More Telugu News