Natti kumar: టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు

  • క్రాంతి కుమార్‌ను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు
  • కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగిన నట్టి కుమార్
  • విధులకు ఆటంకం కలిగించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నేమోదు

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్, ఆయన కుటుంబ సభ్యులపై హైదరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలపై ఈ కేసు నమోదైంది. డిసెంబరు 31న బేగంపేట కంట్రీక్లబ్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు దర్శకుడు రాంగోపాల్ వర్మను తీసుకొస్తామని హామీ ఇచ్చిన నిర్వాహకులు ఆయనను తీసుకురాలేదు. ఇచ్చిన మాటను తప్పారంటూ ఈవెంట్ నిర్వాహకులతో నట్టి కుమార్ తనయుడు క్రాంతి కుమార్ ఘర్షణకు దిగారు. దీంతో ఆయన కారును అడ్డుకున్న నిర్వాహకులు, తాళాలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.

దీంతో తన కారు కనిపించడం లేదంటూ కంట్రీక్లబ్ వద్ద విధుల్లో ఉన్న ఎస్సై విజయ్ భాస్కర్ రెడ్డికి క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇందుకు అంగీకరించని క్రాంతికుమార్ ఎస్సైతో వాదులాటకు దిగడంతో ఆయనను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలిసిన నట్టి కుమార్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 13 మందితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాదులాటకు దిగారు. తన కుమారుడిని ఎందుకు తీసుకొచ్చారంటూ ఘర్షణకు దిగడమే కాకుండా విధుల్లో ఉన్న సిబ్బందిని నట్టి కుమార్ కుటుంబ సభ్యులు చేత్తో నెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. తమ విధులకు భంగం కలిగించడంతోపాటు పోలీసులను నెట్టినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News