Crime News: దర్జాగా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి .. రైల్వే పోలీసులకు చిక్కిన వైనం

  • ఏసీ కోచ్ ల్లో ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు చోరీ 
  • నిందితుడు ఒడిశాలోని కోరాపుట్ వాసి 
  • ఆరు ల్యాప్ టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం

దర్జాగా ఏసీ కోచ్ ల్లో ప్రయాణిస్తూ వీలు చిక్కినప్పుడు తోటి ప్రయాణికుల ల్యాప్ టాప్లు, ఖరీదైన మొబైల్ ఫోన్లు చోరీచేసి దిగిపోతున్న దర్జా దొంగను రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిని ఒడిశా రాష్ట్రం కోరాపుట్ వాసిగా గుర్తించారు. అతని వద్ద నుంచి ఆరు ల్యాప్ టాప్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవత్సవ్ అందించిన వివరాలు ఇవీ.

వాల్తేరు డివిజన్ పరిధిలో రాకపోకలు జరిపే రైల్వే ఏసీ కోచ్ ల్లో ఖరీదైన ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు మాయమవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిపడుతుండడంతో జీ ఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టారు. చోరీలన్నీ ఒకేలా  జరుగుతుండడం ప్రయాణికుల వివరాలు, ఎక్కడెక్కడ దిగుతున్నదీ, ఏఏ రైళ్లలో చోరీలు జరిగాయి? తదితర అంశాలన్నింటినీ కూలంకుషంగా పరిశీలించారు.

చోరీలన్నింటికీ ఒకడే వ్యక్తి బాధ్యుడని తమకు లభించిన ఆధారాల మేరకు గుర్తించారు. దీంతో కోరాపుట్ కు చెందిన బిశ్వజిత్ కౌశల్ (25)ను పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో మొత్తం విషయం బయటకు వచ్చేసింది.

అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 6 ల్యాప్ టాప్లు, మూడు ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు మంచినీళ్లకు, కాలకృత్యాలకు వెళ్లే సమయంలో కౌశల్ తన చేతికి పనిచెప్పేవాడు.

More Telugu News