Air India: అదే జరిగితే ఎయిరిండియా ఇక మూతే!

  • రూ. 60 కోట్ల అప్పుల్లో ఎయిరిండియా 
  • ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూపులు
  • నిధులు విదల్చని ప్రభుత్వం

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను కొనేవారు ముందుకు రాకపోతే మూసివేత తప్పదని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎయిరిండియాపై ప్రస్తుతం రూ.60 వేల కోట్ల అప్పుల భారం ఉంది. ఇందులోని వాటాలను విక్రయించి గట్టెక్కేందుకు చేసిన ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నష్టాల ఊబి నుంచి సంస్థను బయటపడేసి తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

వచ్చే ఏడాది జూన్ నాటికి కొనుగోలుదారులను తీసుకురావాలనేది ప్రభుత్వ యోచన. అప్పటికీ ఎవరూ ముందుకు రాకపోతే సంస్థను మూసివేయడం తప్ప మరో మార్గం లేనట్టే. ప్రస్తుతం సంస్థకు చెందిన 12 చిన్న సైజు విమానాలు షెడ్డుకే పరిమితమయ్యాయి. వీటిని ప్రారంభించాలన్నా కొద్దిపాటి నిధులు అవసరమని అంటున్నారు. మరోవైపు, ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.

2011-12 మధ్య ప్రభుత్వం రూ.30,520.21 కోట్ల నిధులు విడుదల చేసినా సంస్థ ఆశించిన స్థాయిలో పురోగతి సాధించ లేదు. మరోవైపు, ప్రస్తుతానికి సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నా.. జూన్ వరకు మాత్రం ఇవి కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా ఇన్వెస్టర్లు రాకపోతే మూసివేత తథ్యమని  సంస్థ ఉన్నతాధికారి  ఒకరు పేర్కొన్నారు.

More Telugu News