Prakasam District: మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: టీడీపీ నేత శిద్ధా డిమాండ్

  • ప్రజాభీష్టం మేరకే నాడు రాజధానిగా అమరావతి  
  • ప్రస్తుతం అమరావతి వేదికగా పాలన జరుగుతోందిగా
  • అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఇలాంటివి చేస్తే ఇబ్బంది

ప్రకాశం జిల్లా మార్టూరులోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శిద్ధా రాఘవరావు, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకే నాడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం అమరావతి వేదికగా పాలన జరుగుతుండగానే మూడు రాజధానుల ప్రకటన చేయడం దారుణమని, ఈ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఇలాంటివి చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని శిద్ధా హెచ్చరించారు.

దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో అమరావతి అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రభుత్వ తీరుపై నిరసనలు తెలుపుతున్న రాజధాని రైతులకు తమ సంఘీభావం తెలుపుతామని, తుళ్లూరు వెళ్లి వారిని కలుస్తామని చెప్పారు.

More Telugu News