CM KCR: నేను కలలుగన్న తెలంగాణ ఆవిష్కారం కానుంది: సీఎం కేసీఆర్

  • కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సుభిక్షమవుతోంది
  • నీటి నిల్వలు నిండుగా ఉన్నాయి
  • ఇక్కడి రైతాంగం నిశ్చింతగా ఉండచ్చు 

మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ లలో నీటి నిల్వలు నిండుగా ఉన్నాయని, ఎస్సారెస్పీతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో రెండు పంటలు పండే అవకాశమేర్పడిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతానికి కరవు పీడ తొలగిపోయిందన్నారు. వర్షం లేకున్నా.. ఇక్కడి రైతాంగం నిశ్చింతగా పంటలు పండించుకోవచ్చన్నారు.

ఈ రోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో పర్యటించారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరస్వామిని కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వర జలాశయాన్ని సందర్శించారు. సిరిసిల్ల మానేరు వంతెన వద్ద గోదావరి నదికి జలహారతి సమర్పించారు.  

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురయ్యామన్నారు. గోదావరి నది ఈ ప్రాంతాన్ని అనుకుని ప్రవహిస్తున్నప్పటికీ అప్పట్లో ఈ ప్రాంతం కరవు కాటకాలకు లోనయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చేశామన్నారు.  

కాళేశ్వరం నుంచి నీటిని ఈ డ్యామ్ లకు ఎత్తిపోయించామన్నారు. కరీంనగర్ జిల్లాలో 140 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉంటుందన్నారు. 1230 చెక్ డ్యాంలకు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులిచ్చామన్నారు. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంల నిర్మాణం కోసం రూ.1,258 కోట్లు కేటాయించామన్నారు. తాను కలలుగన్న తెలంగాణ అవిష్కారమవుతోందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కింద 70 నుంచి 80 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయన్నారు. త్వరలోనే కరీంనగర్ జిల్లా ప్రముఖ పర్యాటక స్థలంగా ఆవిర్భవించనుందని చెప్పారు.

More Telugu News