Andhra Pradesh: విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి ఆ రెండు జిల్లాల మధ్య ఫార్మా కంపెనీ ఉంది: వర్ల రామయ్య

  • బోస్టన్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య స్నేహితుడే రోహిత్ రెడ్డి అన్న వర్ల రామయ్య
  • రోహిత్ రెడ్డికి ఫార్మా కంపెనీ ఉందని వెల్లడి
  •  విశాఖ, విజయనగరం జిల్లాల్లో భూములున్నాయని ఆరోపణ

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రాజధానిపై ఈ బీసీజీ సంస్థ నివేదిక వచ్చిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని ఏపీ మంత్రి వర్గం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో, విపక్షాలు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఓ బోగస్ కంపెనీ అని అన్నారు. బీసీజీపై 100 మిలియన్ పౌండ్ల మేర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఈ సంస్థపై పోర్చుగీసు ప్రభుత్వం విచారణ కూడా జరిపిందని వెల్లడించారు.

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య స్నేహితుడు రోహిత్ రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడేనని పేర్కొన్నారు. విశాఖ-విజయనగరం జిల్లాల మధ్య రోహిత్ రెడ్డికి ఫార్మా కంపెనీ ఉందని, ఆ కంపెనీకి రెండు జిల్లాల్లో వందల ఎకరాల భూములున్నాయని వర్ల రామయ్య ఆరోపించారు. గత ఆర్నెల్ల కాలంలో అక్కడ వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని వెల్లడించారు. అంతేకాకుండా, గతంలో అమరావతి ఎలా ఉండాలో చెప్పిన కేటీ రవీంద్రన్ ఇప్పుడు జీఎన్ రావు కమిటీలో సభ్యుడని తెలిపారు.

More Telugu News