GN RAO: ఏపీ ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ వేయడమే తప్పు: టీడీపీ నేత సోమిరెడ్డి

  • ఈ కమిటీ క్రెడిబులిటీ ఏంటి?
  • తలతిక్క రిపోర్టు ఇచ్చింది
  • దక్షిణాఫ్రికా దేశంతో మన చిన్న రాష్ట్రాన్ని సీఎం ఎలా పోలుస్తారు?

ఏపీ ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ వేయడమే తప్పు అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ కమిటీ క్రెడిబులిటీ ఏంటి? తలతిక్క రిపోర్టు ఇచ్చిందని దుయ్యబట్టారు. ఈ నివేదికపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబితే, ‘రాజధాని విశాఖ’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఏపీకి పదింతలు పెద్దదిగా ఉండే దక్షిణాఫ్రికా దేశంతో మన రాష్ట్రాన్ని సీఎం జగన్ పోల్చిచూడటాన్ని చూస్తే వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థమవుతుందని అన్నారు.

మనదేశంలో 732 జిల్లాలకు 25 హైకోర్టులు, 15 బెంచ్ లే ఉన్నాయని, ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే, కర్నూలులో హైకోర్టు, అమరావతి, విశాఖపట్టణాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేస్తానని జగన్ చెబుతున్నారని విమర్శించారు. ఈ లెక్కన చూస్తే దేశంలో 175 హైకోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తుందని సెటైర్లు విసిరారు. ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని గుర్తుచేశారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించొద్దని సోమిరెడ్డి అన్నారు. 

More Telugu News