Sujana Chowdary: ఆ గొప్ప జీఎన్ రావు ఒక అసెంబ్లీ సెషన్ వైజాగ్ లో అని చెప్పారు.. ఇది వింటే పిల్లవాడు కూడా నవ్వుతాడు: సుజనా చౌదరి

  • మూడు రాజధానులు అనే అంశమే హాస్యాస్పదం
  • హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని రాజధాని అని అనరు
  • 7 నెలల్లో పరిపాలనపై వైసీపీ శ్రద్ధ చూపించిన పాపాన పోలేదు

రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేదే బీజేపీ ఆకాంక్ష అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. బీజేపీ తరపున తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు మౌనదీక్ష కూడా చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. వారికి కావాలనుకుంటే జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ ను వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చని, కార్పొరేట్ ఆఫీసును రాష్ట్రంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చని... రాజధానిని కూడా వారు కార్పొరేట్ సంస్థగా భావిస్తున్నట్టున్నారని దుయ్యబట్టారు. హైదరాబాదులో రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులు అనే అంశమే హాస్యాస్పదమని సుజనా చౌదరి ఎద్దేవా చేశారు. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఎవరూ రాజధాని అనరని... 30 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగే ప్రాంతాన్ని కూడా రాజధాని అనరని చెప్పారు. ఆ గొప్ప జీఎన్ రావు గారు ఒక సెషన్ (బడ్జెట్ సెషన్) వైజాగులో అంటూ నివేదికలో చెప్పారని విమర్శించారు. రెండేళ్ల వయసున్న పిల్లవాడు కూడా ఇది వింటే నవ్వుతాడని అన్నారు.

వైసీపీ వాళ్లు ఆరోపించే విధంగా తాను ఆరోపణలు చేయలేనని... వైజాగ్ లో వాళ్లు భూములు కొనుక్కుంటే కొనుక్కుని ఉండవచ్చని సుజనా చౌదరి అన్నారు. రాజధానిపై వారి నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతున్నానని... ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. హైకోర్టును మార్చడం కూడా అనుకున్నంత సులువు కాదని... దీనికి కొలీజియం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఆమోదం కావాలని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెప్పారు. ఈ 7 నెలల్లో పరిపాలనపై వైసీపీ శ్రద్ధ చూపించిన పాపాన పోలేదని విమర్శించారు. రాజకీయ దుర్భాషలకే ప్రాధాన్యతనిచ్చారని అన్నారు.

More Telugu News