Odisha: మా వద్ద నుంచి సూచన రాగానే కనిపించిన వాటినన్నింటినీ కాల్చేయండి: ఒడిశా కాంగ్రెస్ సీనియర్ నేత పిలుపు

  • పెట్రోల్‌, డీజిల్‌తో రెడీగా ఉండాలి
  • గాంధీ గిరితో లాభం లేదు
  • నేతాజీని అనుసరిస్తాం
  • అత్యాచారాలపై ప్రభుత్వ స్పందన బాగోలేదు

అందరూ పెట్రోల్‌, డీజిల్‌తో రెడీగా ఉండాలని తమ వద్ద నుంచి సూచన రాగానే కనిపించిన వాటినన్నింటినీ కాల్చేయాలని ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రదీప్‌ మాఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మైనర్‌ బాలికపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నిన్న 12 గంటల పాటు నవరంగ్‌పూర్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందుకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. ముందు కనిపించిన వాటన్నిటినీ దగ్ధం చేయాలని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఆయన ఆందోళనకారులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యలపై మాఝీ స్పందిస్తూ.. గాంధీగిరితో న్యాయం జరగదని, తాము నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొచ్చారు.  

బాలికలపై హత్యాచార ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోతే తాము ఇలాగే చేస్తామని మాఝీ అన్నారు. హత్యాచార ఘటన జరిగి రెండు వారాలయినా పోలీసులకు ఇంతవరకూ పోస్ట్‌మార్టం నివేదిక అందలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

More Telugu News