Hyderabad: హైదరాబాద్ నుంచి ముంబయికి బుల్లెట్ రైలు!

  • డీపీఆర్ తయారీకి రూ. 7 కోట్లు
  • నివేదిక తయారైన తరువాత బోర్డు రివ్యూ మీటింగ్
  • పూణె మీదుగా 711 కిలోమీటర్ల ట్రాక్

హైదరాబాద్ నుంచి ముంబయి మధ్య బుల్లెట్ రైలు కోసం డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి రూ. 7 కోట్ల వరకూ విడుదల కానుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారై, ఆపై బోర్డు రివ్యూ మీటింగ్ జరిగితే, రెండు నగరాల మధ్యా హై స్పీడ్ రైల్వే కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే ఇండియాలోని తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుగా ముంబై - అహ్మదాబాద్ మధ్య వచ్చే సంవత్సరం నుంచి పనులు ప్రారంభం కానున్న విషయం విదితమే.

ఇటువంటివే మరో 5 హై స్పీడ్ ప్రాజెక్టులను రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించగా, అందులో సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య సెమీ హై స్పీడ్ రైల్ లైన్ కు సహకరించేందుకు రష్యన్ రైల్వేస్ కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ అంగీకరించింది. దేశంలో హై స్పీడ్ కారిడార్ల పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఇక హైదరాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 711 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది. పూణె మీదుగా సాగే రైల్వే లైన్ డీపీఆర్ తయారీకి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీపీఆర్ రెడీ అయిన తరువాత దాన్ని రైల్వే బోర్టు సమీక్ష కోసం పంపాల్సివుంటుంది. అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లే డీపీఆర్ కు ఆమోదం లభిస్తే, నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 2023 నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News