Uttam Kumar Reddy: దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కేసీఆర్ కూడా కారకుడే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన తొలి వ్యక్తి కేసీఆర్
  • బీజేపీ సీఎంల కంటే ముందే మద్దతు ప్రకటించారు
  • సీఏఏకు వ్యతిరేకంగా ఈనెల 28న ర్యాలీ చేపడతాం

దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి నోట్ల రద్దే అతి పెద్ద కారణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారకులైన వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరని ఆరోపించారు. నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించిన తొలి వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే కేసీఆర్ మద్దతు తెలిపారని చెప్పారు. మతతత్వ పార్టీకి మద్దతిచ్చిన కేసీఆర్... ఇప్పుడు మాట్లాకుండా మిన్నకుండిపోయారని ఎద్దేవా చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోనే ఉద్యమాలు జరుగుతున్నాయని ఉత్తమ్ చెప్పారు. రాజకీయాల కోసం మతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాడుకోదని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈనెల 28న గాంధీ భవన్ నుంచి ర్యాలీ చేపడతామని వెల్లడించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తమ ర్యాలీని జరిపి తీరుతామని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పాల్గొనే వేదికను తాము పంచుకోబోమని తెలిపారు. ఇతర పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తామని చెప్పారు.

More Telugu News