Jharkhand: ఏజేఎస్యూతో పొత్తు పెట్టుకుని ఉండుంటే... ఇప్పుడు బాధపడుతున్న బీజేపీ!

  • పొత్తుంటే 40 సీట్లు వచ్చుండేవి
  • కాంగ్రెస్ కూటమికి 34 సీట్లే
  • ఓట్ షేరింగ్ డేటా విశ్లేషణ

ఝార్ఖండ్ లో అధికారాన్ని కోల్పోయిన తరువాత, అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్న బీజేపీ నేతలు, ఇప్పుడు బాధపడుతున్నారు. రాష్ట్రంలో స్థానిక పార్టీగా ఉన్న ఏజేఎస్యూ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే, అధికారం తమ చేతిలోనే ఉండేదని అంటున్నారు. బీజేపీ, ఏజేఎస్యూ పొత్తు పెట్టుకుని, కూటమిగా పోటీ చేసి ఉంటే, 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 40 సీట్లు వచ్చుండేవని, ఓట్ షేరింగ్ లెక్కలు తేల్చాయి. అప్పుడు మెజారిటీకి కేవలం ఒక్క స్థానం దూరంలో కూటమి ఉండేది. అదే సమయంలో జేఎంఎం- కాంగ్రెస్ కూటమి 34 సీట్లకు పడిపోయి ఉండేది.

ఎన్నికల ఫలితాల తరువాత ఓట్ షేరింగ్ డేటాను విశ్లేషిస్తుంటే పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. బీజేపీ - ఏజేఎస్యూ కూటమికి 41.5 శాతం ఓట్లు వచ్చుండేవి. కాంగ్రెస్ కూటమి 35.4 శాతం ఓట్లకు పరిమితమయ్యేది. బీజేపీ కూటమి బరిలో ఉంటే బీజేపీకి అదనంగా 9 సీట్లు, ఏజేఎస్యూకు మరో 4 సీట్లు వచ్చుండేవి. ఇప్పుడు మాత్రం అత్యధిక ఓట్లను పొందినా, అధికారాన్ని బీజేపీ దక్కించుకోలేపోయింది.

More Telugu News