Hindupur: మాట్లాడుకుందాం రమ్మని పిలిచి.. ప్రేమికుడిపై హత్యాయత్నం

  • కర్ణాటక అమ్మాయిని ప్రేమించిన హిందూపురం మండలం యువకుడు
  • మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన బాలిక బంధువులు
  • యువకుడు, అతడి బావపై కొడవలితో దాడి

మాట్లాడేందుకు పిలిచి ప్రేమికుడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన హిందూపురం మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కెంచనపల్లికి చెందిన అశోక్.. కర్ణాటకలోని దనూరులో ఇంటర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారం రోజుల క్రితం ఇద్దరూ కలిసి నందిహిల్స్‌కు వెళ్లడంతో విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది.

దీంతో మాట్లాడుకుందాం రమ్మంటూ బాలిక తల్లిదండ్రులు అశోక్‌ను పిలిచారు. సరేనన్న అశోక్, వరుసకు బావ అయిన బాలుతో కలిసి కుడుమలకుంట సమీపంలోని పారిశ్రామికవాడ వద్దకు వెళ్లారు. అక్కడ వారిని చూసిన యువతి బంధువులు తొలుత బాలుని పట్టుకుని చితకబాదారు. అనంతరం అశోక్‌పై కొడవలితో దాడి చేశారు.

వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలు, అశోక్‌ అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాలుని గౌరీబినూరు ఆసుపత్రికి, వీపుపై గాయంతో రక్తమోడుతున్న అశోక్‌ను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News