Dharmana Prasad: రాజధాని రైతుల ఆందోళనపై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు

  • అమరావతి రైతుల ఉద్యమం బోగస్
  • అందులో ఉన్నోళ్లంతా టీడీపీ కార్యకర్తలే
  • పత్రికల్లో బొమ్మలు చూసుకునేందుకే ఉద్యమం

మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఉద్యమం బోగస్ అన్న ఆయన.. అందులో ఉన్నవారంతా టీడీపీ కార్యకర్తలేనని విమర్శించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి సదుపాయం కల్పించినందుకు జై అంటామని, కానీ రాజధానిలోని లింగులింగుమంటూ ఉన్న ఓ 8 ఊరోళ్లు మాత్రం గొప్ప పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని మాట్లాడారు. పత్రికల్లో బొమ్మలు వస్తుండడంతో వాటిని చూసుకునేందుకే ఆందోళన చేస్తున్నట్టు అర్థం వచ్చేలా  ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వాసులమైన తాము 70 సంవత్సరాలుగా దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నామని, తమకు లేని పోరాటం మీకెందుకని ఎద్దేవా చేశారు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేకుండా 70 ఏళ్లుగా బతుకుతున్నామని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పప్పులేం ఉడకవని, అమరావతి రైతుల ఉద్యమం బోగస్ అని ధర్మాన కొట్టిపారేశారు.

More Telugu News