Hemanth soren: జేఎంఎం శాసనసభా పక్ష నేతగా హేమంత్‌ సోరెన్‌ ఎన్నిక.. 29న ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం!

  • గవర్నర్ ద్రౌపది ముర్మును కలిసిన హేమంత్ సోరెన్
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి
  • జేవీఎం చీఫ్ బాబులాల్ మరాండితో  హేమంత్ సోరెన్ సమావేశం

ఝార్ఖండ్ సీఎంగా రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు హేమంత్ సోరెన్ (44) సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) కూటమి 47 స్థానాలు గెలుచుకుని జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో  నిన్న సాయంత్రం కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన సోరెన్.. గవర్నర్‌ ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. గవర్నర్ అందుకు అంగీకరించడంతో ఈ నెల 29న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిపారు.  

కాగా, గవర్నర్‌ను కలవడానికి ముందే హేమంత్ సోరెన్‌ను జేఎంఎం ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఝార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజా తాంత్రిక్) అధ్యక్షుడు బాబులాల్ మరాండితో హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో జేఎంఎం జట్టు కట్టడానికి ముందే ఆ పార్టీకి జేవీఎం మద్దతు ప్రకటించింది.

More Telugu News