Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో జగదీశ్ ఖట్టర్ అరెస్ట్

  • రూ.170 కోట్ల రుణాన్ని పొంది తిరిగి చెల్లించని ఖట్టర్
  • రుణాన్ని నిరర్థక ఆస్తులుగా గుర్తించిన బ్యాంకు 
  • జగదీశ్ ఖట్టర్ ను అరెస్టు చేసిన సీబీఐ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరో మోసానికి గురైంది.  నగల వ్యాపారి నీరవ్ మోదీ వేల కోట్లలో బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ ఎండీ జగదీశ్ ఖట్టర్ రూ.110 కోట్ల మేర నష్టం కలిగించినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జగదీశ్ ఖట్టర్ ను అరెస్టు చేసింది.

వివరాలలోకి వెళితే, జగదీశ్ ఖట్టర్ మారుతిలో ఎండీగా 1993 నుంచి 2007వరకు కొనసాగారు. అనంతరం 'కార్ నేషన్'ను స్థాపించి.. 2009లో పీఎన్బీ నుంచి రూ.170 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. 2012లో ఈ రుణాన్ని బ్యాంక్ ఎన్పీఏ(నిరర్థక ఆస్తులు)గా ప్రకటించింది.

మరోవైపు ఖట్టర్, కార్ నేషన్ లు బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులను కూడా అమ్మివేయడమేకాక, నిధులను దారి మళ్లించినట్లు సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. పీఎన్ బీ ఫిర్యాదు నేపథ్యంలో సీబీఐ మోసం, నేరపూరిత కుట్ర తదితర నేరాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

 ఈ రుణాలు తీసుకునేందుకు కార్ నేషన్ కు ఖట్టర్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కార్ నేషన్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, కార్ నేషన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హామీ ఇచ్చాయి. అంతేకాక, మరో ఐదుగురు కూడా కార్ నేషన్ కు హామీగా నిలిచారని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.

More Telugu News